ఏలూరు, తేదీ :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆదివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఏలూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలు, కూలీల జీవనాధారంగా నిలిచిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం వెనుక ఉన్న తాత్పర్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్తగా ఇతర పేరును పెట్టడం ద్వారా ప్రజావ్యతిరేక విధానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోందని ఆరోపించారు. గ్రామీణ పేదల ఉపాధి భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నిరసన దీక్షలలో భాగంగా, ఏలూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో
దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆలపాటి నరసింహమూర్తి,
చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిజ,
తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

