నిస్వార్థ ఫౌండేషన్ ఎనిమిదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
RSR NEWS
ఏలూరు,, RSR,న్యూస్ : ఎడిటర్ శ్రీనివాస్,,
ఏలూరు నగరంలోని నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, ఆపన్నహస్తం అందిస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నామని ఫౌండేషన్ అధినేత ప్రశాంత్ తెలిపారు. ఫౌండేషన్ ఏర్పడి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు నగరంలోని లయన్స్ క్లబ్ హాలులో ఘనంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిస్వార్థ ఫౌండేషన్ ద్వారా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ అధినేత ప్రశాంత్ మాట్లాడుతూ,
ఏలూరు జిల్లాలోని దివ్యాంగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, అలాగే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు తమ వంతుగా సహాయం అందిస్తున్నామని తెలిపారు. సమాజంలోని ప్రతి అవసరమున్న వ్యక్తికి అండగా నిలవడమే నిస్వార్థ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో ‘బృందావనం’ అనే పర్యావరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తనతోపాటు రేయింబవళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు, సేవాభావంతో ఉన్న సభ్యులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.





