🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఘనంగా నిర్వహణ
ఏలూరు:
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అమరజీవి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన నిరాహార దీక్ష దేశ చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన చేసిన త్యాగం అపారమని పేర్కొన్నారు. ఆయన ఆత్మార్పణంతోనే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన మహనీయుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష చివరకు ప్రాణత్యాగంగా మారి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఆయన జీవితం త్యాగం, నిస్వార్థ సేవలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
తరువాత జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి అమరజీవి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




